Tuesday 18 December 2012

సోంపేట కాల్పుల పై  చర్యల నివేదిక ఇవ్వండి

హైదరాబాద్, డిసెంబర్ 17: సోంపేట కాల్పుల ఘటనపై న్యాయ విచారణకు సంబంధించి చర్యల నివేదికను సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. దీనిపై ప్రభుత్వ అభిప్రాయాన్ని కూడా వెల్లడించాలంటూ అడ్వకేట్ జనరల్‌కు సూచించింది. ప్రజాస్వామ్యయుతంగా నిరసన తెలియచేస్తున్న వారిపై జరిపిన కాల్పుల ఘటనకు సిబిఐ చేత విచారణ చేయించాలంటూ దాఖలైన పిటీషన్‌లో విచారణ చేపట్టిన కోర్టు, గతంలో న్యాయ విచారణకు ఆదేశించింది. న్యాయ విచారణ పూర్తి నివేదికను ప్రభుత్వానికి సమర్పించినందున, ఆ నివేదికకు సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకున్నారన్న దానిపై వివరణ ఇవ్వాలంటూ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ పినాకి చంద్రఘోష్, జస్టిస్ విలాన్ వి అఫ్జల్ పుర్కర్‌లతో కూడిన ధర్మాసనం ఆదేశించింది. తదుపరి విచారణ జనవరి రెండో వారానికి వాయిదా వేసింది. కేసులో శ్రీకాకుళం జిల్లా ఎస్పీ, కలెక్టర్‌తోపాటు డిజిపి, రాష్ట్ర ప్రభుత్వం, నిర్మాణ కంపెనీలను ప్రతివాదులుగా పేర్కొన్నారు. ప్రయివేట్ వ్యక్తుల ప్రోద్బలంతోనే ప్రాజెక్టుకు వ్యతిరేకంగా నిరసనకు దిగిన స్థానికులపై కాల్పులు జరిగాయని పిటీషనర్ తరుపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. దీనిపై స్పందించిన కోర్టు న్యాయ విచారణపై ప్రభుత్వం వివరణ ఇవ్వాలంటూ ఆదేశించింది.

No comments:

Post a Comment